ఎన్నికలకు ఇంకొన్ని రోజులే ఉండటంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. జనానికి చేరువయ్యేందుకు ఆకర్షణీయమైన పథకాల్ని రూపొందిస్తున్నారు. ప్రత్యర్థులపైనా విమర్శలతో విరుచుకుపడుతున్నారు. నిన్న యలమంచిలి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన రెండేళ్ళు జైల్లో ఉండొచ్చిన జగన్ ముఖ్యమంత్రి అవుతానంటున్నారు. అలాంటప్పుడు జనం కోసం పనిచేసే జనసైనికులు పదవులు కోరడంలో తప్పేంటని అన్నారు.
సెజ్ల పేరుతో భూములు సేకరించి వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి నాయకులు రుణాలు పొందుతున్నారు. జనసేన అధికారంలోకి వస్తే సెజ్లలో 50 శాతం ఉద్యోగాలు స్థానిక యువతీ యువకులకు వచ్చేలా చేస్తామని అన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరి అవినీతిపై ఒకరు పుస్తకాలు రాసుకున్నారు. జగన్ లక్ష కోట్ల అవినీతి చేస్తే టీడీపీ నేతలు 3 లక్షల కోట్లు దోచుకున్నారు. వీరి వలన యువత భవిష్యత్తు అయోమయంగా మారింది. వారి కోసమే రాజకీయాల్లోకి వచ్చా. నేనిప్పుడు పవర్ స్టార్ కాదు. మీ భాద్యత చూడాల్సిన సైనికుడ్ని అన్నారు.