ఆంధ్రప్రదేశ్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ఇలా ప్రాంతాల వారీగా చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను పేర్కొంది. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామని జనసేన హామీ ఇచ్చింది. చట్ట సభల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, గృహిణులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, రేషన్కు బదులు మహిళల ఖాతాల్లో రూ.2500 నుంచి రూ.3500 వరకు నగదు జమ వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతామని పేర్కొంది.
జనసేన ఇచ్చిన హామీలలో రైతులకు రూ.8 వేలు పెట్టుబడి సాయం, 60 ఏళ్ల పైబడిన రైతులకు పెన్షన్, ఒకటి నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ లాప్టాప్లు పంపిణీ వంటివి ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంతకుముందే ప్రకటించినట్లుగా ఉద్యోగుల సీపీఎస్ రద్దు వంటి తదితర అంశాలను మేనిపెస్టోలో చేర్చారు. మొత్తం 96 హామీలను జనసేన మేనిఫెస్టోలో పొందుపరిచింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచే రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే సంకల్పంతో ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు ఆ పార్టీ పేర్కొంది.