న్యూఢిల్లీ: మూడు రోజుల పాలసీ సమావేశం ముగింపు రోజు గురువారం ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) వరుసగా రెండోసారి వడ్డీ రేటును తగ్గించనుందని రాయిటర్స్ సర్వే వెల్లడించింది. కొద్ది రోజుల్లో సాధారణ ఎన్నికల్లో ఉన్నాయనంగా ఈ రేటు కోత ఉండే అవకాశముందని పలువురు ప్రముఖులు అభిప్రాయడ్డారు. డిసెంబర్లో శక్తికాంత దాస్ ఆర్బిఐ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రేటు కోత ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తొలి సమావేశం నిర్వహించిన ఫిబ్రవరి నెలలోనే వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటు విధానాల్లో కీలక మార్పులకు దాస్ శ్రీకారం చుట్టారు. ద్రవ్యోల్బణం తగ్గుదల, వృద్ధి రేటు క్షీణతే కారణమని ఆర్బిఐ వర్గాలు పేర్కొన్నప్పటికీ, పాలసీ నిర్ణయాలకు ఈ కారణాలు చెప్పడం అందరినీ సంతృప్తిపర్చలేదు.
ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే ఆర్బిఐ ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుందని కొందరు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ప్రముఖ ఆర్థికవేత్త ప్రకాశ్ సక్పాల్ మాట్లాడుతూ, వడ్డీ రేట్ల విషయంలో ఆర్బిఐపై కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఉందని తెలుసు, ఎన్నికలకు కేవలం వారం రోజుల ముందు తీసుకునే నిర్ణయంతో వృద్ధి రేటు పెరిగి. అది ఎన్నికలపై ప్రభావం చూపుతుందనేది ఆలోచించాల్సిన విషయమని అన్నారు. ఎన్నికల వేళ పార్టీలు ప్రకటిస్తున్న జనాకర్షక పథకాలతో ధరలపై భారం పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఆర్థిక విధానాలను మరింత సులభతరం చేయడం సరికాదని సర్వేలో పాల్గొన్న కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. 85శాతం మంది కీలక రేట్లను ఆర్బిఐ తగ్గిస్తుందని తెలిపారు. అలాగే రెపోరేటును 6శాతానికి తగ్గించి దాదాపు వచ్చే సంవత్సరం మధ్య కాలం వరకు అలాగే ఉంచే అవకాశమున్నట్లు పేర్కొన్నారు.