అమరావతి : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పసుపు-కుంకుమ కింద మహిళలకు ఇచ్చే డబ్బును ఆపాలని వైఎస్ఆర్సిపి నేతలు హైకోర్టులో పిటిషన్లు వెయ్యడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... మహిళలకు ఇచ్చే డబ్బును ఎవరైనా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారా అని అన్నారు. కేసిఆర్ బెదిరింపుల వల్లే సినీనటుటు జగన్ వద్దకు క్యూ కడుతున్నారని, ఎన్నికలు కాగానే అందరూ హైదరాబాద్కు చెక్కేస్తారని అన్నారు. హైదరాబాద్లో ఆస్తులు కాపాడుకోవడం కోసం వైఎస్ఆర్సిపి కండువాలు కప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. ఒక్కసారి గెలిపించాలని వైఎస్ఆర్సిపి మొసలికన్నీరు కారుస్తుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి డబ్బులివ్వడానికి మోదికి చేతులు రాలేదు కాని, ఏపిని, టిడిపిని నిందించడానికి పెద్ద నోరు వచ్చిందని విమర్శించారు. మోది నిందలతో అందరికీ రోషం రావాలని, పట్టుదల పెరిగి పౌరుషంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తే తమకూ ఇవ్వాలన్న కేసిఆర్తో కలిసి ఏపికి జగన్ ఏం హోదా తెస్తాడు? అని ప్రశ్నించారు? జగన్ ఆస్తుల కోసం కేసిఆర్తో, కేసుల కోసం మోదితో లాలూచీ పడ్డారని విమర్శించారు. ముస్లిం సంఘాలు మోదిపై, ఆయన దత్త పుత్రుడు జగన్పై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.