గల్లీలో ఉంటే సేవ చేసినం.. ఢిల్లీలో ఉంటే తెలంగాణ హక్కుల కోసం కొట్లాడినం

SMTV Desk 2019-04-02 16:11:32  kavita, mp , trs

నిజామాబాద్‌ : టిఆర్‌ఎస్‌ ఎంపి కవిత ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన్‌లో ఏర్పాటు చేసిన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...తెలంగాణలో ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి జరగాలంటే గల్లీలో కాదు.. ఢిల్లీలో కూడా మన సర్కారే ఉండాలి.. మన గులాబీ జెండా ఉండాలే అని కవిత పేర్కొన్నారు. ఇప్పుడు 16 ఎంపీలు గెలిస్తే.. తెలంగాణ హక్కులను కాపాడుకోవచ్చు. ఎన్నికలు ఉన్నా లేకున్నా.. ఢిల్లీలో అయినా, గల్లీలో అయినా ప్రజల కోసం పని చేసే పార్టీ టీఆర్‌ఎస్‌ పార్టీ సీఎం కేసీఆర్‌ను గెలిపించాలి అని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. మన ఊరు మన ఎంపీ కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లో పర్యటించాను. ఈ సందర్భంగా వచ్చిన వినతులను స్వీకరించి సీఎం కేసీఆర్‌తో మాట్లాడి సమస్యలను పరిష్కరించాను. గల్లీలో ఉంటే సేవ చేసినం.. ఢిల్లీలో ఉంటే తెలంగాణ హక్కుల కోసం కొట్లాడినం. నా పని తీరు నచ్చితే మరోసారి గెలిపించండి. నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కనబడటం లేదు. కాంగ్రెస్‌, బీజేపీ మ్యాచ్‌ఫిక్సింగ్‌ చేసుకున్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి జెండా ఎత్తేసి.. మా కార్యకర్తలంతా.. బీజేపీకే ఓటేస్తారని చెప్పిండంట. కొన్ని గ్రామాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు కలిసి తిరుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేదు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి రూ. 7 వేల కోట్లు ఇచ్చారు. మనం 16 ఎంపీ స్థానాలు గెలిస్తే పలు ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించుకోవచ్చు అని ఆమె తెలిపారు.