మంత్రి భూమా అఖిలప్రియ ఎండదెబ్బ

SMTV Desk 2019-04-02 16:06:34  Akhila priya,

అసలే మండుటెండలు మరోపక్క ఎన్నికల సీజన్. మరి ఎన్నికల్లో ఓటరు దేవుడి కరుణ కావాలంటే పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇంటింటికి తిరగాల్సిందే. అందుకే ఎండను కూడా లెక్క చేయకుండా అభ్యర్థులు ప్రచారంలో ఉన్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారానికి వెళుతున్న నేతలకు వడదెబ్బ తగులుతోంది. కొందరు నీరసించి అస్వస్థతకు గురవుతున్నారు. రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లా పెనమలూరు టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌.. కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డిలు కూడా వడదెబ్బకు గురయ్యారు.

ప్రచారానికి వెళ్లిన సమయంలో అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ఎండల్లో ప్రచారం చేయడం వల్ల నేతలు డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. తాజాగా మంత్రి భూమా అఖిలప్రియ ఎండదెబ్బకు అస్వస్థతకు గురయ్యారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారానికి వెళ్లారు. దీంతో ఆమె మళ్లీ అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల నుంచి విశ్రాంతి తీసుకుంటున్న అఖిలప్రియ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. మంత్రికి వైద్యులు ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆమె తరపున కుటుంబ సభ్యులు, భర్త, కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు.