లెజండరీ డైరెక్టర్ మహేంద్రన్ కన్నుమూత

SMTV Desk 2019-04-02 13:37:32  tamil director, mahendran, writer, cinema director died

చెన్నై, ఏప్రిల్ 02: ప్రముఖ తమిళ డైరెక్టర్, నటుడు, రచయిత జే మహేంద్రన్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. ఆయనకు జాన్ మహేంద్రన్ అనే కుమారుడు ఉన్నారు. మణిరత్నం, శంకర్ వంటి ప్రస్తుత దిగ్గజ దర్శకులకు ఆయనే మార్గదర్శి.

రజనీకాంత్ కు ఎక్కువ గుర్తింపును తెచ్చిన దర్శకుడు కూడా మహేంద్రన్ అనడంలో సందేహం లేదు. 80 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన మహేంద్రన్, రెండు సార్లు జాతీయ అవార్డులను సైతం అందుకున్నారు. చెన్నైలోని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ బీఓఎఫ్టీఏ డైరెక్షన్ విభాగం హెడ్ గా పనిచేస్తూ, ఎంతో మందిని దర్శకులుగా తీర్చిదిద్దారు. ఈ సంవత్సరం విడుదలైన పెటా, బూమరాంగ్ చిత్రాల్లోనూ ఆయన నటించారు. మహేంద్రన్ మృతిపై కోలీవుడ్ తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు.