హైదరాబాద్ : రాష్ట్ర విద్యాశాఖ ఈ సారి పుస్తకాలను పంపిణీ చేయడంలో ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఈ వేసవి సెలవుల్లోనే పూర్తిగా పుస్తకాల ముద్రణ పూర్తిచేసి ఆ వెంటనే పుస్తకాలు విద్యార్థులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. బడులు ప్రారంభమయ్యే రోజునే ( జూన్ 1న) ప్రభుత్వ, ఎయిడెడ్ , గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మే నెలాఖరు నాటికి అన్ని పాఠశాలలకు పుస్తకాలు చేరేలా చర్యల తీసుకుంటున్నారు. ఇప్పటికే 30 లక్షలకు పైగా పుస్తకాలు జిల్లాలకు పంపినట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి పదోతరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 52 లక్షల మందికి పైగా ఉన్న విద్యార్థులకు కోట్లకు పైగా పుస్తకాలు కావల్సి ఉందని అధికారలు వెల్లడించారు. 40 సంస్థలకు ప్రింటింగ్ బాధ్యతలు అప్పగించామని తెలిపారు. ముడిసరుకు ధరలు పెరగడంతో ఆ ప్రభావం పుస్తకాల ధరలపై పడే అవకాశం వుంది. పుస్తకాల ధరలు 20 శాతం వరకు పెరగొచ్చని అన్నారు.