అమెరికా, ఆగస్ట్ 14: ఇటీవల ఉత్తర కొరియా గువామ్ దీవిని నాశనం చేస్తామని ప్రకటించిన నేపధ్యంలో అమెరికా సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియో సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాపై అణుబాంబులు వేస్తామని భయపెడుతున్న ఉత్తర కొరియా కన్నా, పాకిస్థాన్ ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. ఉత్తర కొరియా దాడి చేసిన అంతగా ప్రభావం చూపించదని, పదేళ్ల క్రితం ఆ దేశపు బలంతో పోలిస్తే మాత్రం కొరియా ఇప్పుడు బలపడిందని ఆయన తెలిపారు. అమెరికాతో యుద్ధానికి ఉత్తర కొరియా ముందుకు వచ్చినా, మా శక్తి ముందు ఆ దేశం ఏమీ చేయలేదన్న విషయం దేశ ప్రజలకు తెలుసని ఆయన అభిప్రాయపడ్డారు. ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ కోరిక తీరబోదని, తమ దేశం ఎప్పటికి భయపడదని ఆయన ఎద్దేవా చేశారు. ఖండాంతర క్షిపణులున్నాయని ఆ దేశం ఎంత ప్రచారం చేసుకున్నప్పటికీ, అమెరికాను ఏలా రక్షించుకోవాలో మాకు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.