మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ స్టార్లతో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘సైరా… నరసింహారెడ్డి’. 100 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై రామ్చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రీ ఇండిపెండెన్స్ నేపథ్యంలో రాయలసీమకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను తెరపై ఆవిష్కరించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సురేందర్ రెడ్డి బృందం ఏడాది కాలంగా రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల ఎప్పుడు? అన్నదానిపై ఇప్పటివరకు సరైన క్లారిటీ రాలేదు. ఈ వేసవిలో విడుదల చేయాలన్న ప్లాన్తోనే ‘సైరా’ చిత్రీకరణను ప్రారంభించారు. కానీ విజువల్ గ్రాఫిక్స్తో ముడిపడిన భారీ చిత్రం కావడంతో ఇప్పుడే రిలీజ్ చేయలేమని ఫిల్మ్మేకర్స్ తెలియజేశారు. ఈ ఆగస్టులో విడుదలకు ప్రయత్నిస్తున్నారని ప్రచారమైంది. అయితే అప్పుడైనా సినిమా విడుదలవుతుందా? అంటే కష్టమేనని మధ్యలో మరో కొత్త ప్రచారం మొదలైంది.
తాజా సమాచారం ప్రకారం ‘సైరా’ చిత్రాన్ని ఆగస్టులోనే విడుదల చేయాలన్న పట్టుదలతో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ఉందని తెలిసింది. సాధ్యమైనంత తొందరగా సినిమాను పూర్తిచేయాలని దర్శకుడు సురేందర్ రెడ్డిపైన వత్తిడి పెంచారట. ఆగస్టు 15న స్వాంతంత్య్ర దినోత్సవం కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయగలిగితే సముచితంగా ఉంటుందని రామ్చరణ్ భావిస్తున్నారట. ఈక్రమంలోనే మే 5 నాటికి సినిమాను పూర్తి చేయాల్సిందిగా దర్శకుడు సురేందర్ రెడ్డికి డెడ్లైన్ విధించారని చెబుతున్నారు. ఇక ఏప్రిల్ 2 నాటికి హైదరాబాద్ కోకాపేటలో కీలకమైన షెడ్యూల్ చిత్రీకరణ పూర్తవుతుంది. ఆతర్వాత ఏప్రిల్ 9 వరకు చైనా లేదా మధ్యప్రదేశ్లో వారం రోజుల పాటు చిత్రీకరణ సాగుతుందట. ఈమేరకు కొత్త షెడ్యూల్ను ఖరారు చేశారని తెలిసింది. ఆగస్టునాటికి ఈ సినిమా రిలీజవుతుందా, లేదా? అన్నది అటుంచితే దసరా పండుగ బరిలో అయినా ‘సైరా’ను రిలీజ్ చేయాలన్న ఆలోచన ఉందని చెబుతున్నారు.
ఇక అదే రోజు ప్రభాస్ నటించిన సాహో చిత్రం కూడా ఆగష్టు 15 న విడుదల ఐతుంది .. మరి ఈ రెండు చిత్రాల మధ్య హోరా హోరి పోటీ ఖాయం అనిపిస్తుంది