అర్జున్‌ నీకు తన ప్రేమను పంపుతున్నాడు ప్రీతి

SMTV Desk 2019-03-31 12:32:36  kaira advani,

బాలీవుడ్‌ ‘ప్రీతి’తో టాలీవుడ్‌ ‘అర్జున్‌ రెడ్డి’ సందడి చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో వీరు కలిశారు. ఈ సందర్భంగా దిగిన సెల్ఫీని విజయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘అర్జున్‌ నీకు తన ప్రేమను పంపుతున్నాడు ప్రీతి. ‘కబీర్‌ సింగ్‌’ సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని పోస్ట్‌ చేశారు. అదేవిధంగా విజయ్‌తో కలిసి దిగిన ఫొటోను కియారా షేర్‌ చేస్తూ.. ‘అర్జున్‌ను ప్రీతి కలిసినప్పుడు..’ అని రాశారు. అంతేకాదు ‘ఈ ఫొటో మీ కోసమే సందీప్‌ రెడ్డి వంగా’ అని కూడా ఆమె ట్వీట్‌ చేశారు. ఈ అవార్డుల వేడుకలో ‘మోస్ట్‌ స్టైలిష్‌‌’ అవార్డును విజయ్‌ అందుకున్నారు.

విజయ్‌, షాలినీ పాండే జంటగా నటించిన తెలుగు సూపర్‌ హిట్‌ ‘అర్జున్‌ రెడ్డి’ని హిందీలో ‘కబీర్‌ సింగ్‌’ టైటిల్‌తో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. మాతృకను తీసిన సందీప్‌ రెడ్డి వంగా దీనికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్‌ పాత్రలో షాహిద్‌ కపూర్‌, ప్రీతి పాత్రలో కియారా అద్వాణీ నటిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌ 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో విజయ్‌కు బాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్‌ ఏర్పడింది. జాన్వి కపూర్‌, షాహిద్‌, కియారా తదితర నటులు ఆయన్ను మెచ్చుకుంటూ పలు సందర్భాల్లో మాట్లాడారు.