పార్టీకి చెందిన బీ ఫారాలను టీడీపీ, వైసీపీలు ఎత్తుకెళ్లాయి

SMTV Desk 2019-03-30 19:08:52  TDP, ycp, ka paul

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి, రాష్ట్రంలో ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. సిబ్బందిపై దాడిచేసి తమ పార్టీకి చెందిన బీ ఫారాలను టీడీపీ, వైసీపీలు ఎత్తుకెళ్లాయ‌ని, వాటి సాయంతో పలు చోట్ల అవి అభ్యర్థులను నిలబెట్టాయని ఆయన ఆరోపించారు. తమ బీ ఫారాలతో టీడీపీ 38, వైసీపీ 11 చోట్ల నామినేషన్లు వేయించాయని ఈసీఐతో భేటీ అయిన అనంతరం పాల్ తెలిపారు. బీ ఫారాల విషయంలో తాను ఇచ్చిన ఫిర్యాదుపై చర్చించేందుకు ఎన్నికల సంఘం తనను పిలిపించిందని ఆయన తెలిపారు. ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తున్నవారిలో చాలామంది తమ పార్టీకి చెందినవారు కాదని, బలవంతంగా బీ ఫారాలు ఎత్తుకెళ్లినవారేనని పాల్ ఆరోపించారు. ఇదిలా ఉండగా పాల్‌కు భద్రత కల్పించాలని ఈసీ ఆదేశించింది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 38 నియోజకవర్గాల్లో వైసీపీ, ప్రజా శాంతి పార్టీ అభ్యర్థుల పేర్లు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. అత్యధికంగా అనంతపురంలో ఎనిమిది చోట్ల ఇలాగే ఉంది. వైసీపీకి చెందిన కీలక స్థానాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇది ముమ్మూటికీ టీడీపీ కుట్రేనని వైసీపీ ఆరోపిస్తోంది. ఓటర్లను గందరగోళంలో పడేసి తమ ఓట్లకు గండికొట్టడం కోసమే చంద్రబాబు ఇలాంటి కుట్రలు చేశారని వైసీపీ నేతలు అంటున్నారు. ప్రజా శాంతి పార్టీ గుర్తుపై కూడా వైసీపీ పలు సార్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫ్యాన్, హెలికాప్టర్ గుర్తులు ఒకేలా ఉన్నాయని, నిరక్షరాస్యులైన ఓటర్లు దీని వల్ల గందరగోళానికి గురవుతారని వైసీపీ వాదిస్తోంది.