పేరు మార్చడం తప్ప పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదు

SMTV Desk 2019-03-30 18:50:08  niti aayog, rahul gandhi,

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే నీతి ఆయోగ్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు. కనీస ఆదాయ పథకంతో దేశం దృష్టిని ఆకర్షించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్.. తాజాగా ‘నీతి ఆయోగ్‌’పై ఆసక్తికర చర్చకు తెరలేపారు. అందుకు స్పష్టమైన కార్యాచరణ కూడా ప్రకటించారు. ఆర్థికవేత్తలు, నిపుణులు, 100 మంది సిబ్బందితో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

కాగా 1950లో ఏర్పాటైన ప్రణాళికా సంఘాన్ని 2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేశారు. ప్రణాళికా సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్’ను ఏర్పాటు చేశారు. పేరు మార్చడం తప్ప పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదని విపక్షాలు దీనిపై దుమ్మెత్తిపోశాయి. నీతి ఆయోగ్ ఏరకంగా ఉపయోగపడలేదని రాహుల్ గాంధీ మండిపడ్డారు. శుక్రవారం (మార్చి 29) పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా మ్యానిఫెస్టో ఉంటుందని చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ వర్గాలతో సంప్రదింపులు, తీవ్ర మేథోమధనం తర్వాతే మ్యానిఫెస్టోను రూపొందించామని, త్వరలో దీన్ని విడుదల చేస్తామని రాహుల్ వివరించారు.