ఎన్నికల సీజన్ అవడంతో వివిధ పార్టీలు ప్రచారం జోరు పెంచాయి. ఈ క్రమంలో సభలకు వచ్చే ప్రజలు ప్రమాదాల బారినపడే సందర్భాలు ఎదురవుతున్నాయి. మొన్న వైసీపీ సభలో స్లాబ్ కూలిపోయి కొంతమందికి గాయాలు అయ్యాయి. ఆ ఘటన గురించి మరిచిపోక ముందే మరో ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో చోటు చేసుకుంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం నంద్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు వున్న సినిమా చరిష్మాతో జనాలు కిక్కిరిసినట్టుగా వచ్చారు. సభ జరుగుతుండగా సభా ప్రాంగణం వద్ద మైక్ సౌండ్ సెట్ తల మీద పడి సిరాజ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే అతణ్ణి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. దీంతో సభా ప్రాంగణం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. సభను మళ్లీ కొనసాగించేందుకు జనసేన కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. ప్రమాదంలో మృతిచెందిన సిరాజ్ది నడిగడ్డ ప్రాంతం. అతను ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. కుమార్తె అంగవైకల్యంతో బాధపడుతోంది. ఇంటికి పెద్ద దిక్కు అయిన సిరాజ్ మరణంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది.