బ్రెజిల్, మే 26 : బ్రెజిల్, ఉత్తర ప్రాంతంలోని రియో గ్రాండ్ డీ నార్త్ రాష్టంలోని ఒక జైలుకు సంబంధించి 89 ఖైదీలు 30 మీటర్ల పొడవు గల ఓ సొరంగం తవ్వుకుని దాని ద్వారా పరారీలో ఉన్నట్లు పోలీసు సిబ్బంది తెలిపారు. ఈ సంఘటన రాష్ట్ర రాజధాని అయిన నాటల్ నగరంలోని పెర్నమిరిం జైలు నుండి గురువారం ఉదయం పరారైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం మీడియాకు ప్రకటించారు. పరారీలో ఉన్న ఖైదీలు ఎంతో పకడ్బందీగా ఈ సొరంగాన్ని తవ్వినట్లు పోలీసులు వెల్లడించారు. రియో గ్రాండ్ డీ నార్త్ జైలులోనే ఇది అతి పెద్ద ఘటనగా భావిస్తున్నారు. 89 మంది ఖైదీలలో 9 మంది ఖైదీలను చేజిక్కిన్చుకున్నామని, మిగతా ఖైదీలు తప్పించుకునేందుకు జైలు బయట రెండు కార్లు ఒక మోటర్ సైకిల్ ను వినియోగించినట్లు జైలు భద్రత సమీక్షిస్తున్న మిలటరీ పోలీసులు తెలిపారు. ఖైదీలు బయటకు వెళ్ళిన తరువాత ఎవరు గుర్తు పట్టకుండా ఉండడానికి, జైలులోనే దుస్తులు మార్చుకున్నట్లు ఆనవాలు తెలుస్తున్నాయి. ఈ ఏడాదిలో ఈ జైలులోనే ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోసారి. గత జనవరిలో 14 మంది ఖైదీలు కూడా సొరంగ మార్గం ద్వారానే తప్పించుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన సమయంలో మొత్తం 589 మంది ఖైదీలున్నట్లు తెలుస్తోంది. ఈ జైలు గరిష్ట సామర్ధ్యం 436 మంది ఖైదీలు.