న్యూఢిల్లీ, ఆగస్ట్ 12 : సెన్సార్ బోర్డు సభ్యులుగా బాలీవుడ్ నుండి హీరోయిన్ విద్యాబాలన్, తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి జీవిత, గౌతమిలు నియమితులయ్యారు. సీబీఎఫ్సీ బోర్డు చీఫ్గా ప్రసూన్ జోషీని నియమించారు. కాగా జోషీ నేతృత్వంలోని కొత్త బోర్డు సభ్యులను ప్రకటించగా, ఆ సభ్యుల్లో గౌతమి, నరేంద్ర కోహ్లి, నరేశ్ చందర్ లాల్, నీల్ హెరబర్ట్, వివేక్ అగ్నిహోత్రి, వామన్ కేంద్ర, విద్యాబాలన్, టీఎస్ నాగభరణ, రమేశ్ పతంగి, వాని త్రిపాఠి, జీవిత రాజశేఖర్, మిహిర్ భూటాలు ఉన్నారు. రెండున్నరేళ్లుగా సీబీఎఫ్సీ చీఫ్గా మాజీ చీఫ్ పెహలజ్ నిహలాని బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఇటీవలే సెన్సార్ బోర్డు నిహలానీని తొలిగించిన విషయం తెలిసిందే. కాగా నిహలాని తన స్టైల్లో సెన్సార్ సర్టిఫికెట్లు ఇచ్చేవారు. స్పెక్టర్ ఫిల్మ్ లో కిస్ సీన్ను కట్ చేసిన తర్వాత ఆయనపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఆ తర్వాత ఉడ్తా పంజాబ్లో దాదాపు 89 కట్లు చేశాడు. ఆయన్ను తొలగించడం పట్ల బాలీవుడ్ సంబరాలు చేసుకుంటుంది.