ముంబై, మార్చ్ 26: ముంబైలో ఓ కొత్త పార్టీ ఏర్పాటైంది. ఈ పార్టీలో ప్రత్యేకత ఏంటంటే పార్టీలో ఉన్నవారంతా మహిళలే. నేషనల్ ఉమెన్స్ పార్టీ(NWP)అనే పార్టీ మహిళలది మాత్రమే కాదండి.. తల్లులది కూడా. దీన్ని ప్రారంభించింది ఓ మెడికో, సామాజిక వేత్త డాక్టర్ శ్వేతా శెట్టి. లోక్ సభలో మహిళలకు 50 శాతం ఉండాలన్నది ఆమె డిమాండ్. లోక్ సభలో మొత్తం 545 స్థానాలు ఉండగా.. అందులో ఈ పార్టీ మహిళా అభ్యర్థులు దాదాపు 283 స్థానాలకు పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా డాక్టర్ శ్వేతా శెట్టి మాట్లాడుతూ... మహిళల ప్రాతినిధ్యంపై దశాబ్దాలుగా చర్చ జరుగుతున్నా.. ఏమి ఉపయోగం ఉండటం లేదు. పార్లమెంట్ లో ఎక్కువ మంది మగవాళ్ళు కావడం వల్లే.. మహిళలకు గుర్తింపు రావట్లేదని ఆమె తెలిపారు. అందుకే మహిళా సాధికారతే తమ పార్టీ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. మహిళల శక్తి సామర్ధ్యాన్ని బయటికు తేవడమే తమ పార్టీ లక్ష్యాల్లో ఒకటని.. వారు సాధికారత సాధించేందుకు తగిన సాయం చేస్తామన్నారు. కాగా త్వరలో ఈ పార్టీ మహిళా రక్షక్ అనే మొబైల్ యాప్ ను కూడా ప్రారంభించబోతున్నారట. ఎమర్జెన్సీ సమయాల్లో మహిళల్ని కాపాడేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని ఆమె చెబుతున్నారు.