ఉత్తరప్రదేశ్, ఆగస్ట్ 12: ఉత్తరప్రదేశ్లో శుక్రవారం రాత్రి దారుణ విషాదం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న ముస్లిం అమ్మాయిలపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించారు. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం... బరేలీ జిల్లా, నవాబ్ గంజ్ ప్రాంతానికి చెందిన అక్కా చెల్లెళ్లు గుల్షన్, ఫిజాల ఇంట్లోకి చొరబడిన కొందరు గూండాలు వారిద్దరిపై పెట్రోలు పోసి, నిప్పంటించి పారిపోయారు. మంటలను తట్టుకోలేక వారు కేకలు పెడుతుంటే, కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనలో 18 ఏళ్ల గుల్షన్ చావు బతుకుల మధ్య పోరాడుతుండగా, 17 ఏళ్ల ఫిజాకు 40 శాతం గాయాలు అయ్యాయి. మంటలు పెట్టిన వారు ఎవరో మాకు తెలియదని, మాకు ఎవరితో తగాదాలు లేవని పోలీసుల విచారణలో కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేసు నమోదు చేశామని, ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసి గూండాల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.