ఒకప్పుడు ఆ నియోజకవర్గం టీడీపీకి కంచు కోట కానీ ఆ ఎమ్మెల్యేకి దాన్ని తన కంచుకోటగా మార్చుకున్నాడు. ఆ నియోజకవర్గంలో తనకు తప్ప మరెవ్వరి గెలుపుకు అవకాశాలు లేవని, ఆ ధీమాతోనే అధికార పార్టీ నేతలపై విమర్శలతో నెటికెంతొస్తే అంతమాటా అనేస్తూ ఉంటాడు. దీంతో ఆయనపై గురి పెట్టిన టీడీపీ చూసి చూసి సరైన బాణాన్నే వదిలింది. అప్పటి దాకా గెలుపుపై ధీమాగా ఉన్న ఆయన ఒక్కసారిగా డీలా పడ్డాడట. టీడీపీ వదిలిన బాణాన్ని చూసి ఆయన పార్టీ కార్యాలయం ఒక్కసారిగా కళ తప్పిందట. ఆయనపేరే కొడాలి నాని. దేవినేని అవినాష్ దూకుడుతో కొడాలి నానికి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడే స్వయంగా రంగంలోకి దిగి గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా దేవినేని అవినాష్ను బరిలోకి దింపడంతో అప్పటి వరకు ఎవరికి వారే యమునాతీరే అన్న రీతిలో ఉన్న గుడివాడ టీడీపీ అగ్ర నేతలు యలవర్తి శ్రీనివాసరావు, రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని వెంకటేశ్వరరావు వీరు ముగ్గురు కూడా కలిసి పనిచేసేందుకు నిర్ణయించారు.
వీరు ముగ్గురు కలయికతో కొడాలి నాని ఈసారి బ్యాక్ టు పెవిలియన్ దేవినేని అవినాశ్ గోయింగ్ టు అసెంబ్లీ అంటూ టీడీపీ శ్రేణులు ప్రచార కార్యక్రమాల్లో నినాదాలు చేస్తున్నారు. మరోపక్క దేవినేని అవినాశ్ సైతం తన వ్యక్తిత్వంతో గుడివాడ ప్రజల మనసును దోచుకున్నారని, వివాద రహితుడు, సౌమ్యుడిగా ఉన్న దేవినేని అవినాశ్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారని, వాటి పరిష్కార మార్గాలు చెబుతూ నియోజకవర్గ ప్రజల్లో భరోసా నింపుతున్నారని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. తాను స్థానికుడు కాదంటూ వైసీపీ శ్రేణులు చేస్తున్న ఆరోపణలకు అవినాష్ గట్టి సమాధానాన్ని ఇస్తూ బస్టాండ్ కి కూతవేటు దూరంలోనే ఓ ఇంటిని కొనేసారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎప్పుడు ఎటువంటి అవసరమొచ్చినా తనను కలవొచ్చంటూ అవినాశ్ చెప్పడంతో అతని గెలుపుకోసం నిరంతరం కృషి చేస్తామంటూ టీడీపీ శ్రేణులు చెప్పుకొస్తున్నారు. ఇలా టీడీపీలో ఎన్నికల ప్రచార కోలాహలం చూసిన కొడాలి నానికి పట్టపగలే చుక్కలు కనపడుతున్నాయని టీడీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నారు.