మనదేమైనా కొబ్బరికాయల వ్యాపారమా?.. పవన్ పై ఫైర్ అయిన పృథ్వి

SMTV Desk 2019-03-26 11:15:29  Pawan Kalyan, Prudhvi

పవన్ కల్యాణ్ చీటికీ మాటికీ తోలు తీస్తా.. తాట తీస్తా అని మాట్లాడుతున్నారు కదా.. ఆ తీసేదేదో చంద్రబాబు, లోకేష్‌లది తీయాలని ఘాటుగా విమర్శించారు కమెడియన్, వైసీపీ నేత పృథ్వి. విశాఖలో మాట్లాడిన పృథ్వీ జగన్‌పై పవన్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ మాట్లాడారు..

‘తొక్క తీస్తా.. తోలు తీస్తానంటున్నావు.. మనదేమైనా కొబ్బరికాయల వ్యాపారమా?.. ప్రజాక్షేత్రంలో ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ ఐదేళ్లలో అవినీతితో రాష్ట్రాన్ని దోచుకున్న బాబు తోలు తీయాలి. అవినీతి చేసే టీడీపీ నేతల తోలు తియ్యండి.. అంతేకానీ నోటికి ఏదొస్తే అది పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ప్రభుత్వ పాలనను విమర్శిస్తాడు గానీ ప్రతిపక్ష నాయకుడిని విమర్శించరు. పవన్ ఒక అసమర్థ నాయకుడు. 2014 ఎన్నికల్లో టీడీపీని బంగారు సైకిల్‌.. చంద్రబాబుని నీతిమంతుడని పొగిడి టీడీపీకి ఓట్లు వేయించావు.. మళ్లీ చంద్రబాబును సీఎంను చేయాలని ప్రజలను మభ్య పెడుతున్నావ్. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. మీ ఇద్దరికీ చరమగీతం పాడటం ఖాయం’ అని విరుచుకుపడ్డారు పృథ్వి.

ఏప్రిల్‌ 11న జరగబోయే ఎన్నికల్లో టీడీపీతో పాటు పవన్ పార్టీని కూడా ప్రజలు భూస్థాపితం చేస్తారని అన్నారు. మాట తప్పని నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో వీధి నాటకాల ద్వారా సినిమా కళాకారులమంతా టీడీపీ అవినీతిని ప్రజలకు వివరిస్తామని తెలిపారు.