దేశవ్యాప్తంగా ఐపీఎల్ సందడి కొనసాగుతోంది. ఎందరో ఆటగాళ్ల రికార్డులు బ్రేకవుతున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీ రికార్డును రిషభ్ పంత్ అధిగమించాడు. ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో పంత్ అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో 18 బంతుల్లో 50 పరుగులు చేశాడు. దీంతో 2012 సీజన్లో ముంబయి ఇండియన్స్పై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ చేసిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డుని పంత్ అధిగమించాడు. ధోని 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా పంత్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసాడు.
మొత్తంగా 7 ఫోర్లు, 7 సిక్సుల సహాయంతో 27 బంతుల్లో 78 పరుగులు చేసి ముంబయి ముందు భారీ లక్ష్యానికి బాటలు వేశాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి ఇండియన్స్ 19.2 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. గతంలో కేఎల్ రాహుల్ 14 బంతుల్లో, సునీల్ నరైన్ 15 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు వారి జాబితాలోకి రిషబ్ పంత్ వచ్చి చేరాడు.