న్యూఢిల్లీ, మార్చ్ 25: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కనీస ఆదాయ పథకం వివరాలను ప్రకటించారు. ఈ పథకం కింద ప్రతి ఏటా దేశంలోని 20 శాతం నిరుపేదలకు రూ.72 వేలు ఇస్తామని ఆయన వెల్లడించారు. ఈ డబ్బంతా నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తుందని రాహుల్ తెలిపారు. దీంతో దేశంలోని 20 శాతం అంటే.. 5 కోట్ల కుటుంబాలకు (సుమారు 25 కోట్ల మంది) ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని ఆయన చెప్పారు. ఆర్థికంగా ఇది సాధ్యమే. గత నాలుగైదు నెలలుగా ఈ పథకంపై అధ్యయనం చేస్తున్నాం. ఇది అత్యంత శక్తివంతమైన ఆలోచన అని ఆయన చెప్పారు. నెలకు ఒక్కో కుటుంబం కనీసం రూ.12 వేల ఆదాయం పొందేలా ఈ పథకం రూపొందించినట్లు రాహుల్ తెలిపారు. ఉదాహరణకు ఒక కుటుంబం నెలకు రూ.6 వేలు సంపాదిస్తుంది అనుకుంటే.. దానిని రూ.12 వేలకు పెంచుతామని రాహుల్ చెప్పారు. ఇదొక చారిత్రక పథకం అని, పేదరికంపై జరిగే చివరి యుద్ధం అని రాహుల్ అన్నారు.