జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తెలంగాణా విషయంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి, ఇటు ప్రత్యర్థి పార్టీలతో సహా సినీ రంగానికి చెందినవారు కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ రచయత కోనా వెంకట్ పలు అంశాల్లో పవన్ వైఖరిపై విమర్శలు గుప్పించారు. మాయావతి వంటివారితో పొత్తు పెట్టుకున్న పవన్, ఆరోపణలు తప్ప ఒక్క కేసు కూడా నిరూపణ కాని వైఎస్ జగన్ పై మాత్రం విషం చిమ్మడం అన్యాయం అని అన్నారు. ఎందుకు వైఎస్ జగన్ను లక్ష్యంగా చేసుకుని పవన్ విమర్శలు చేస్తారో అర్ధం కాదు. వైఎస్ కుటుంబం నిత్యం ప్రజల్లో ఉంటూ, వారి సమస్యలపై పోరాడిన కుటుంబం అని అన్నారు. అటువంటి జగన్పై అకారణంగా రెచ్చగొట్టేలా మాట్లాడటం చాలా తప్పు అని అభిప్రాయ పడ్డారు కోనా.
ఈ సందర్బంగా జగన్ పై చేస్తున్న ఆరోపణల్లో ఒక్కదానికైనా పవన్ కళ్యాణ్ ఆధారాలు చూపించాలని అన్నారు, అలా చేస్తే తాను జనసేన జెండా మోస్తూ పవన్ వెంటే తిరుగుతానని అన్నారు. చంద్రబాబు పాలనలోని అవినీతి, అక్రమాలపై గతంలో మంగళగిరి, కాకినాడ సభల్లో పవన్కల్యాణ్ చేసిన ప్రసంగానికి అనూహ్యమైన స్పందన వచ్చిందని, ప్రజలతో పటు తాను కూడా హర్షించానని అన్నారు. పవన్ ఇన్నాళ్లకు రాజకీయంగా సరైన దారిలోకి వచ్చారని అందరూ అనుకుంటున్న సమయంలో ఏమైందో తెలియదు గానీ, యూ టర్న్ అని అనలేం గానీ, అకస్మాత్తుగా బాబుపై విమర్శల దాడి తగ్గించారు. అధికార టీడీపీని కాకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటున్న జగన్ ను, వైసీపీని విమర్శించటంలో పవన్ కళ్యాణ్ ఆంతర్యం ఏమిటో తనకు అర్థం కాలేదని అన్నారు.