ముంబయి, మార్చ్ 24: మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. త్రయంబకేశ్వర్ వద్ద ప్రమాదవశాత్తు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 45 మందికి తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదాస్థలికి చేరుకుని స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.