ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో తెలుగు దేశం పార్టీ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డ సినీ నటుడు మోహన్ బాబుపై టీడీపీ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన విమర్శలను తిప్పికొడుతూ ఎదురుదాడి కొనసాగిస్తోంది. ఎన్నికల వేళ మంచు ఫ్యామిలీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందంటూ టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని మండిపడ్డారు . ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతో మోహన్ బాబు చంద్రబాబుపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే ముందు తమ స్థాయేంటో మోహన్ బాబు తెలుసుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబును విమర్శించే స్థాయి మోహన్ బాబుది కాదన్నారు.
ఆదివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ..మంచు ఫ్యామిలీ సినిమాల్లో కొట్టే డైలాగులు ఆపాలని.. ఎవరూ వినేవారు లేరన్నారు. విభజనతో నష్టపోయిన ఏపీకి చంద్రబాబు వంటి సమర్థ నాయకత్వం అవసరమన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్కు స్పష్టమైన ప్రణాళికలు, విజన్ లేదని యామిని సాదినేని విమర్శించారు.