ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ యూట్యూబ్లో ట్రెండింగ్లో వుంటున్నారు. ఆయన టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలపై ఎన్ని కామెంట్లు చేసినా ఆ మూడు పార్టీల అధినేతలు ఇంతవరకు స్పందించలేదు. అసలు ఈయనను పట్టించుకున్నట్టు అనిపించడంలేదు. అయినా కేఏ పాల్ తాను తప్పకుండా ఈ ఎన్నికల్లో గెలిచి ఏపీకి సీఎం అవుతాను అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా ఆయన తాజాగా వైసీపీ అధినేత జగన్పై వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో తన పార్టీ తరుపున చిన్నపిల్లాడిని పెట్టి జగన్ను ఓడిస్తానని తెలిపారు.
ఆయన మాట్లాడుతూ.. ‘పులివెందులలో జగన్కు ధీటుగా మంచి వ్యక్తిని నిలబెట్టాం. మా అభ్యర్థి హెలికాప్టర్ గుర్తుకు ఓటు వేసి జగన్ను ఇంటికి పంపాలి. జగన్ దగ్గర లక్ష కోట్ల రూపాయలు ఉన్నాయి. మా అభ్యర్థి దగ్గర కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఉన్నాయి.
సీఎం చంద్రబాబు, పవన్కు ఓటు వేయొద్దు. రెబల్ అభ్యర్థులు తెలివిలేక ఓడిపోయే పార్టీల గురించి మాట్లాడుకుంటున్నారు. గెలిచే పార్టీ, ప్రజాశాంతి పార్టీ మాత్రమే అని వాళ్లకు తెలియదు’ అని అన్నారు.