వేములవాడ, మార్చ్ 23: వేములవాడ రాజన్న ఆలయంలో రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి మున్సిపల్ కమిషనర్ గంగారాం స్వామివార్లకు పట్టువస్ర్తాలు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కళ్యాణోత్సవానికి భారీగా తరలివచ్చారు. స్వామివార్ల కళ్యాణం దృష్ట్యా ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. భక్తులకు శ్రీఘ్రదర్శనంను అమలు చేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో కోడె మొక్కులను సైతం నిలిపివేశారు. ఆలయంలో ఈ సాయంత్రం శివ పురాణ ప్రవచనాలు జరగనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి హోమం, ఉపాసన, బలిహరణం కార్యక్రమాలను చేపట్టనున్నారు. పెద్ద సేవలో భాగంగా స్వామివారి ఊరేగింపు కొనసాగనుంది.