ముంబయి ఇండియన్స్‌కి మరో షాక్!

SMTV Desk 2019-03-23 16:28:45  ipl 2019, mumbai indians, rohit sharma, malinga, adam milne

మార్చ్ 23: ఐపీఎల్ 2019 సీజన్ ఈ రోజు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ ముంగిట ముంబయి ఇండియన్స్‌కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇదివరకే ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ ఆ జట్టు తొలి ఆరు మ్యాచ్‌లకీ తాను అందుబాటులో ఉండనని ప్రకటించగా.. తాజాగా మరో ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే గాయం కారణంగా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం రాత్రి 8 గంటలకి వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. ప్రపంచకప్‌ జట్టులోకి ఎంపిక చేయాలంటే దేశవాళీ క్రికెట్‌లో వన్డేలు ఆడాలని శ్రీలంక సెలక్టర్లు హుకుం జారీ చేయడంతో లసిత్ మలింగ ఏప్రిల్ 11 వరకూ ఐపీఎల్‌కి దూరంగా ఉండనున్నాడు. దీంతో.. విదేశీ ఫాస్ట్ బౌలర్లు మిల్నే (న్యూజిలాండ్), మెక్‌లాగన్ (న్యూజిలాండ్), బెహ్రండ్రాఫ్ (ఆస్ట్రేలియా), బెన్ కటింగ్ (ఆస్ట్రేలియా)లతో సర్దుకుందామని ఆశించిన ముంబయికి.. ఈరోజు మిల్నే షాకిచ్చాడు. కాలి మడమ గాయం కారణంగా.. అతను టోర్నీ మొత్తానికీ దూరమైనట్లు తాజాగా ముంబయి ఇండియన్స్‌ ప్రకటించింది.