న్యూఢిల్లీ, ఆగస్ట్ 11 : పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు దంపతులు ప్రధాని మోదీని కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నేటితో పార్లమెంట్ సమావేశాలు ముగుస్తుండడం, ఆ తర్వాత నూతన గవర్నర్ల నియామకం ఉంటుందని వస్తున్న వార్తల నడుమ కృష్ణంరాజు దంపతుల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య ఎన్నికైన వేళ దక్షిణాదిలో ఏర్పడిన లోటును భర్తీ చేసేందుకుగాను, మరింత మందికి పదవులను ఇవ్వనున్నట్లు భావిస్తున్న తరుణంలో వీరి కలయిక చర్చలకు దారి తీసింది. కాగా కృష్ణంరాజుకు గవర్నర్ పదవి ఇచ్చే విషయమై గతంలో ఉహాగానాలు వచ్చిన విషయం విదితమే. అయితే ఈ విషయంలో స్పందించిన కృష్ణంరాజు తాము కేవలం మర్యాదపూర్వకంగానే మోదీని కలిసామని, రాజకీయాల పరంగా మాట్లాడలేదని వ్యాఖ్యానించారు.