ఫిలింనగర్ లో ఖైరతాబాద్ వినాయకుడి లడ్డు..!

SMTV Desk 2017-08-11 10:11:46  khairathabad ganesh, laddu, film nagar

హైదరాబాద్, ఆగస్ట్ 11 : హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ లో ప్రతి సంవత్సరం భారీ వినాయకుడిని ప్రతిష్టించి, చేతిలో అలంకరించే లడ్డు గురించి అందరికి తెలిసిందే. అయితే ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి చేతిలో అలంకరించబడే తాపేశ్వరం మహా లడ్డు ఫిలింనగర్ కు వెళ్లనుంది. ఎందుకంటే.. ఈ లడ్డు ప్రసాదం పంపిణీ, ఇటు పోలీసులకు, అటు ఈ ఉత్సవ నిర్వాహకులకు తలకు మించిన భారం అవుతుందట. అంతేకాకుండా తోపులాటలు, లాఠీచార్జ్ లు జరగడం తదితర కారణాలతో ఈ ఏడాది లడ్డు ప్రసాదాన్ని ఇక్కడ కాకుండా ఫిలింనగర్ తీసుకెళ్ళనున్నట్లు సమాచారం. లడ్డు స్థానంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన లడ్డును స్వామి చేతిలో అలంకరి౦చనున్నట్లు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ స్పష్టం చేసి౦ది. కాగా ప్రతి సంవత్సరం తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం సురుచి స్వీట్స్‌ సంస్థ యజమాని పోలిశెట్టి మల్లికార్జునరావు స్వామివారికి ఈ లడ్డును అందిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి కూడా ఫిలింనగర్ లో ప్రతిష్ఠింపబడే వినాయకుడికి 500 కిలోల మహాలడ్డూ ప్రసాదాన్ని అందించనున్నట్టు స్వయంగా ఆయనే తెలిపారు.