నంద్యాల, ఆగస్ట్ 10: ఇటీవల వైసీపీ అధినేత జగన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై ఈసీ కి జగన్ వివరణ ఇవ్వడం కూడా జరిగింది. తాజాగా మరోసారి ప్రతిపక్ష నేత జగన్ ఏపీ ముఖ్యమంత్రిని ఉరితీయాలంటూ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. దీనిపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈసీ నోటీసులు జారీ చేసిన జగన్ కు బుద్ధి రాలేదంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే జగన్ ఇలా మాట్లాడుతున్నారని సోమిరెడ్డి స్పష్టం చేసారు. ప్రతిపక్ష నేతపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. జగన్ ఈ రోజు చేసిన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోనూ ఏ నాయకుడూ ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. ప్రజలను మోసం చేస్తోంది జగనేనని వ్యాఖ్యానించారు. పాదర్శకమైన పాలన అందిస్తోన్న టీడీపీపై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.