బెంగళూరు, మార్చ్ 22: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ శుక్రవారం బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ స్థానం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మార్చి 12వ తేదీన బెంగళూరులో మీడియా, భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ రాజకీయ ప్రసంగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రసంగాన్ని ఒకరు రికార్డు చేసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రకాశ్రాజ్పై కబ్బన్ పార్కు పోలీసు స్టేషన్లో కేసు కూడా నమోదైంది. గత కొంతకాలంగా ఆయన కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. దేశంలో భావ ప్రకటనకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆయన చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 2019 సార్వత్రిక ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని గతంలో ఆయన ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన బెంగళూరు సెంట్రల్ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు.