నంద్యాల, ఆగస్ట్ 10: ఎన్నికల పర్వం మొదలైతే చాలు నియోజక వర్గంలో ప్రజలు ఊహించని మార్పులు చాలా వస్తాయి. ఉపఎన్నికల నేపధ్యంలో నంద్యాలలో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. దానికి తోడు ఈ ఉపఎన్నికలు 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరుగుతున్నందుకు మరీ రసవత్తర పరిణామాలు నంద్యాల నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్నాయి. వివరాల్లోకి వెళ్తే కానాలపల్లె గ్రామానికి చెందిన 200 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ తీర్థం తీసుకున్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, ఆమంచి కృష్ణ మోహన్ ల సమక్షంలో వీరు టీడీపీ గూటికి చేరారు. నియోజకవర్గం అభివృద్ధిని ఎప్పుడు పట్టించుకోని శిల్పా మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగటానికి వస్తున్నాడని మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రశ్నించారు. దివంగత భూమా నాగిరెడ్డి ప్రతిపాదించిన పనులన్నింటినీ పూర్తి చేయడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి భారీ మెజార్టీ చేకూర్చాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీ నేతలు టీడీపీపై చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.