ముంబై, మార్చ్ 19: ప్రయివేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ పరిస్థితి రోజురోజుకి మరింత దిగాజారిపోతోంది. సంస్థ ఆర్థిక ఇబ్బందుల కారణంగా లీజు చెల్లించలేకపోవడంతో మరో 4 విమానాల కార్యకలాపాలు విమానయాన సంస్థ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రాకపోకలు సాగించకుండా ఆగిపోయిన జెట్ ఎయిర్వేస్ విమానాల సంఖ్య 41కి చేరింది. ఈ నేపథ్యంలో ‘జెట్’ పరిస్థితులపై కేంద్రం తాజాగ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. జెట్ ఎయిర్వేస్ పరిస్థితులపై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేయాలంటూ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు తన మంత్రిత్వశాఖ కార్యదర్శిని ఆదేశించారు. అంతేగాక.. జెట్ ఎయిర్వేస్ ఎదుర్కొంటున్ సమస్యలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) నుంచి తక్షణమే నివేదిక తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు.