అమేథి, ఆగస్ట్ 10: భారత రక్షకదళం ఇటీవల లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ దుజానా ను మట్టుపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతీకార చర్యగా ముష్కర మూక అమృతసర్ వెళుతున్న ఓ రైలులో బాంబును అమర్చగా, దాన్ని అమేథి రైల్వే స్టేషన్లో పసిగట్టి నిర్వీర్యం చేశామని ఎస్పీ సౌమిత్రా యాదవ్ తెలిపారు. అకల్ తాఖత్ ఎక్స్ ప్రెస్ (12317)లోని టాయిలెట్ లో అనుమానాస్పదంగా ఉన్న ఓ వస్తువును చూసినట్టు ఫిర్యాదు రావడంతో రైలును ఆపి, రెండు బోగీలలోని ప్రయాణికులను దించి తనిఖీలు చేపట్టామని, ఇది స్వల్ప ప్రభావాన్ని చూపే బాంబుగా గుర్తించామని ఆయన అన్నారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీల తరువాత రైలు తిరిగి ప్రయాణమైందని అన్నారు. ఉగ్రవాది అబూ దుజానా ఎన్ కౌంటర్ పై పగ తీర్చుకునేందుకు విధ్వంసక చర్యకు పూనుకున్నట్లు బాంబు సమీపంలో ఉన్న ఓ లేఖ ప్రకారం తెలుస్తోందని చెప్పారు.