ముంబై, మార్చ్ 19: భారత మహిళా షూటర్ తేజస్విని సావంత్ గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ...అది 2005, నా కెరీర్ ప్రారంభమవుతున్న రోజులవి. అప్పుడే నేను జర్మనీలో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలకు హాజరవ్వాలి. కానీ నా ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించలేదు. ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి. అదే సమయంలో మా కుటుంబానికి దగ్గర బంధువు అయిన బిజెపి నాయకుడు చంద్రకాంత్ పాటిల్ దగ్గరికి వెళ్లాను. ఆయన వెంటనే నన్ను మనోహర్ పారికర్ దగ్గరకు తీసుకెళ్లారు. అప్పటివరక నేను సాధించిన విజయాలను చూసి, నేను జర్మనీ వెళ్లి పోటీల్లో పాల్గొనడానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి వెంటనే రూ.లక్ష చెక్కుపై సంతకం చేసి ఇచ్చారు. నేను ఆశ్చర్యపోయాను. ఆయన చేసిన సహాయం నా కెరీర్ని మలుపు తిప్పంది. ఆ పోటీల్లో రెండు రౌండ్లు 400 పాయింట్లకు 397, 396 చొప్పున సంపాదించి భారత అగ్రశ్రేణి షూటర్లలో ఒకరిగా పేరు సంపాదించుకోగలిగాను. అలా 2010 జర్మనీలో జరిగిన ప్రపంచ పోటీల్లో బంగారు పతకం సాధించాను. అంతర్జాతీయ స్థాయిలో ఈ విభాగంలో బంగారు పతకం సాధించిన మొదటి భారత మహిళా షూటర్గా నిలిచారు. అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆ సమయంలో గోవా ప్రభుత్వం నాకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని ముందుకొచ్చింది. అలా ఉద్యోగం చేసుకుంటే పారికర్ నాకు చేసిన సహాయానికి నేను న్యాయం చేయలేనని భావించి ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించి దేశానికి మరిన్ని పతకాలు సాధించాలనే కాంక్షతో ముందుకు వెళ్లాను అని అన్నారు.