డెహ్రాడూన్, మార్చ్ 18: కొడుకు పెళ్లి తండ్రి చావుకచ్చినట్టు....ఓ తండ్రి తన కొడుకు పెళ్లి వల్ల చిక్కులో ఇరుక్కున్నాడు. పూర్తి వివరాల ప్రకారం...ఉత్తరాఖండ్కు చెందిన జగదీశ్ చంద్ర జోషి అనే వ్యక్తికి ప్రధాని నరేంద్ర మోదీ అంటే చాలా ఇష్టమట. అయితే ఆయనకున్న ఇష్టంతో అతడి కుమారుడు జీవన్ పెళ్లి పత్రికల్లో వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి ఓటువేయాలంటూ పిలుపునిచ్చారు. ‘బహుమతులేవీ తీసుకురావద్దు. వధూవరులను ఆశీర్వదించడానికి వచ్చే ముందు.. దేశహితం కోసం ఏప్రిల్ 11న జరిగే పోలింగ్లో మోదీకి ఓటెయ్యండి’ అని అచ్చు వేయించాడు. ఉత్తరాఖండ్లో ఏప్రిల్ 11న మొదటి విడతలో ఎన్నికలు జరగనుండగా… జోషి తనయుడు జీవన్ పెళ్లి ఏప్రిల్ 22న జరగనుంది. పెళ్లి పత్రికలో ప్రధాని మోదీకి ఓటు వేయాలని కోరడాన్ని ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా ఈసీ పరిగణించింది. జోషికి రిటర్నింగ్ అధికారి నోటీసులు జారీ చేసి 24 గంటల్లో వ్యక్తిగతంగా ఈసీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. జోషికి నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రాజన్న కూడా ధ్రువీకరించారు. దీనిపై స్పందించిన జగదీశ్ చంద్ర జోషి ఈ విషయంపై ఎన్నికల సంఘానికి క్షమాపణ చెప్పారు. తనకు తెలియకుండా తన పిల్లలు పెళ్లి పత్రికలో మోదీకి ఓటు వేయాలని ముద్రించారని వివరించాడు.