హైదరాబాద్, మార్చి 18: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ కు సెన్సార్ చిక్కులు తొలగినట్టే ఉన్నాయి. ఈ విషయాన్ని నిన్న అర్ధరాత్రి వర్మ స్వయంగా ట్వీట్ చేశారు. "మా కార్యాలయం, సెన్సార్ బోర్డు మధ్య దురదృష్టవశాత్తూ కొన్ని అపార్థాలు చోటు చేసుకున్నాయి. అవిప్పుడు తొలగిపోయాయి. నిబంధనల ప్రకారం, అవసరమైన చర్యలను తీసుకునేందుకు సెన్సార్ బోర్డు సిద్ధంగా ఉంది. కాబట్టి నేడు మేము అనౌన్స్ చేసిన మీడియా సమావేశాన్ని రద్దు చేస్తున్నాము. జై ఎన్టీఆర్" అని వర్మ వ్యాఖ్యానించారు. కాగా, ఈ సినిమాను తొలిదశ ఎన్నికల తరువాత విడుదల చేసుకోవాలంటూ సెన్సార్ బోర్డు అధికారుల నుంచి తనకు సమాచారం వచ్చిందని, ఇది హక్కులకు భంగమని, తాను కోర్టుకు వెళతానని వర్మ హెచ్చరించిన సంగతి తెలిసిందే.