జగన్ పని అందరినీ చంపడమని ఘాటు వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

SMTV Desk 2019-03-17 15:34:33  Jagan, Chandrababu,

అమరావతి, మార్చ్ 17: మన ఓటుతో ఈ ముగ్గురికి.. జగన్, కేసీఆర్, మోదీ బుద్ధి చెప్పాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపు నిచ్చారు. ఏపీలో మనల్ని దెబ్బతీసేందుకు కేసీఆర్ వస్తానంటున్నారని, మనం అభివృద్ధి చెందితే తెలంగాణ ఎత్తిపోతుందని కేసీఆర్ భయమని విమర్శించారు. అందుకే, మనల్ని దెబ్బతీసి, అభివృద్ధి చెందకుండా చూసి రాజకీయం చేయాలనుకుంటున్నారని, హైదరాబాద్ లో ఉన్న వారిని బెదిరిస్తున్నారని, నోటీసులు ఇస్తున్నారని, ‘టీడీపీ జోలికొస్తే ఖబడ్దార్..జాగ్రత్త’ అని హెచ్చరించారు.

ఇక పోతే , వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, చిన్న శ్రీనులు రెచ్చిపోతున్నారని, ఫోక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీని తాను తీసుకొస్తే, బొత్స అవినీతి కారణంగా ఆ కంపెనీ వెళ్లిపోయిందని విమర్శించారు. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఏమీ పని చేయని కేసీఆర్ కు 88 సీట్లు వస్తే, తాను రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని, తమ పార్టీకి 150 సీట్లు రావాలని అన్నారు. వైరం ఉన్న నాయకులందరినీ కలిపామంటూ.. కిషోర్ చంద్రదేవ్-శత్రుచర్ల, కేఈ- కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ,ఆదినారాయణరెడ్డి-రామసుబ్బారెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి-పరిటాల సునీత ల పేర్లను ఆయన ప్రస్తావించారు. మన పని అందరినీ కలపడమైతే, జగన్ పని అందరినీ చంపడమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.