కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరికాసేపట్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి విజయవాడలో పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు స్థానిక సమాచారం . ఈరోజు మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు అని తెలిసిందే . ముద్రగడ చేరితో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీకి అదనపు బలం వచ్చినట్లేనని జనసేన వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.తెరవెనక పద్మనాభం కొడుకు చల్లారావుకి టికెట్ ఇచ్చే విషయంలో జనసేన నుంచీ కచ్చితమైన హామీ లభించినట్లు తెలుస్తోంది.
ఇంతకముందు ముద్రగడ పద్మనాభంను టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ నేతలు గట్టిగానే ప్రయత్నించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ఇంట్లో కాపు జేఏసీ నేతలతో టీడీపీకి చెందిన ఓ ముఖ్యనేత సమావేశం అయినట్టు తెలిసింది. టీడీపీలో చేరితే ముద్రగడ పద్మనాభం కుమారుడు చల్లారావుకి పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అంశంపై చర్చించినట్టు సమాచారం.
కాపులకు రిజర్వేషన్ల అంశంపై ముద్రగడ పద్మనాభం పోరాటం చేస్తున్నారు. చంద్రబాబునాయుడుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున లేఖాస్త్రాలు సంధించారు. తుని ఘటన తర్వాత కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభంను అరెస్ట్ చేయడం, తన కుటుంబసభ్యులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కన్నీరు పెట్టడం వంటివి జరిగాయి. ఈ పరిస్థితులు ముద్రగడ పద్మనాభం టీడీపీలో చేరే అవకాశాల్ని దూరం చేశాయి. ఆయన టీడీపీలో చేరి ఉంటే... కాపు వర్గం నుంచీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశాలున్నాయని సంకేతాలు అందడంతో... ఆయన జనసేన వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో... పెద్ద నేతలను జనసేనలోకి చేర్చుకోవడం ద్వారా పవన్ కల్యాణ్ రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.