తెలంగాణలో కూడా పోటీకి జనసేన సై!

SMTV Desk 2019-03-17 11:25:47  janasena,

హైదరాబాద్, మార్చ్ 17:పవన్‌కల్యాణ్‌ నేతృత్వంలో జనసేన పార్టీ ఈసారి ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో పోటీకి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈసారి తెలంగాణలో కూడా పోటీకి సిద్దం అవుతోంది. జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బి. మహేందర్ రెడ్డి మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేయబోతున్నట్లు పవన్‌కల్యాణ్‌ శనివారం సాయంత్రం ప్రకటించారు. నిజానికి ఇదివరకే ఆయన జనసేన తరపున మెదక్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేసేందుకు సిద్దపడ్డారని, కానీ సకాలంలో నామినేషన్ వేయలేకపోవడంతో పోటీ చేయలేకపోయారని పవన్‌కల్యాణ్‌ చెప్పారు. జనసేన ఆశయాలు నచ్చి పార్టీలో చేరిన మహేందర్ రెడ్డి, పార్టీ కోసం తన వ్యాపారాలను వదులుకొని పనిచేస్తున్నారని చెప్పారు. రాజకీయాలలో అటువంటి నిబద్దత కలిగిన వ్యక్తుల అవసరం చాలా ఉందని అందుకే ఈసారి ఆయనను మల్కాజ్‌గిరి నుంచి లోక్‌సభకు పోటీ చేయిస్తున్నానని పవన్‌కల్యాణ్‌ చెప్పారు.

మల్కాజ్‌గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. తెరాస, బిజెపిలు ఇంకా తమ అభ్యర్ధులను ప్రకటించవలసి ఉంది. కనుక ఆ మూడు ప్రధానపార్టీల నుంచి జనసేన అభ్యర్ధి మహేందర్ రెడ్డికి గట్టి పోటీయే ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకు ఆయన సిద్దపడ్డారు కనుకనే బరిలో దిగుతున్నారనుకోవచ్చు.