ముంబయి, మార్చ్ 16: టీమిండియా సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఈ ఐపిఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరుపున బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. యువీ ఈ సీజన్ కోసం తన నెట్ ప్రాక్టీస్ను షురూ చేశాడు. ఈ ఏడాది ఐపిఎల్ వేలంలో యువరాజ్ సింగ్ ఏ జట్టు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోగా, చివరి నిమిషంలో ముంబై ఇండియన్స్ అతన్ని కనీస ధరకే దక్కించుకుంది. గతేడాది కింగ్స్ పంజాబ్ తరుపున ఎనిమిది మ్యాచ్లు ఆడిన యువరాజ్ సింగ్ 65 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో ఈ ఏడాది అతన్ని జట్టులో కొనసాగించే సాహసం కింగ్స్ పంజాబ్ ఫ్రాంచైజీ చేయలేదు. ఈ క్రమంలోనే వేలానికి యువరాజ్పై ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి కనబరచలేదు. కాగా, చివరికి ముంబై ఇండియన్స్ రూ. కోటికి కొనుగోలు చేసింది.