మార్చ్ 16: నిన్న ఉదయం న్యూజిలాండ్ లొనీ రెండు మసీదుల్లో దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే క్రిస్ట్చర్చ్ నగరంలోని అల్నూర్ మసీదు వద్ద కాల్పులకు పాల్పడ్డ దుండగుడు దాడినంతా ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు న్యూజిలాండ్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 17 నిమిషాల పాటు ఈ లైవ్ స్ట్రీమింగ్ జరిగినట్లు తెలిపాయి. దీంతో సోషల్ మీడియాపై కొన్ని ఏజెన్సీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఉన్న లైవ్ స్ట్రీమింగ్ సదుపాయాన్ని మంచి సందర్భాల కోసం కాకుండా ఇలాంటి దారుణాలకు ఉపయోగించడం సరి కాదని సదరు ఏజెన్సీలు తెలిపాయి. మొత్తం 17 నిమిషాల పాటు లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంటే ఫేస్బుక్, యూట్యూబ్ ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నిస్తున్నాయి. దాడి జరిగిన కొన్ని గంటల్లోపు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏజెన్సీల వ్యాఖ్యలపై ఫేస్బుక్ స్పందించింది. ‘ఈ లైవ్కు సంబంధించి పోలీసులు తమకు ఫిర్యాదు చేశారని వెంటనే ఈ దాడికి సంబంధించిన వీడియోలను, ఇతర సమాచారాన్ని పూర్తిగా తొలగించామని ఫేస్బుక్ తెలిపింది. రెండు మసీదుల్లోనూ దాడికి పాల్పడ్డ నిందితుల ఖాతాలను వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తొలగించినట్లు ఫేస్బుక్ ట్వీట్ చేసింది.