వెల్లింగ్టన్, మార్చ్ 15: న్యూజిలాండ్ సెంట్రల్ క్రైస్ట్చర్చ్ నగరంలోని ఓ మసీదులో శుక్రవారం ఉదయం దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ఆరుగురు అక్కడే చనిపోగా మిగితా 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అదే సమయంలో మరో దుండగుడు ఇంకో మసీదులో చొరబడి కాల్పులు జరిపాడు. ఇదే సమయంలో న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ క్రికెటర్లు కూడా అక్కడే ఉన్నారు. దుండగుడు కాల్పులు జరుపుతూ దాదాపు 17 నిమిషాల పాటు లైవ్ స్ట్రీమింగ్ కూడా చేయడం గమనార్హం. దీంతో వెంటనే అప్రమత్తమైన బంగ్లాదేశ్ ఆటగాళ్లు అక్కడినుంచి పక్కనే ఉన్న పార్క్ ద్వారా తప్పించుకున్నారు. బంగ్లదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ట్విటర్లో ఈ సంఘటన గురించి పోస్ట్ చేశాడు…‘మా జట్టు సభ్యులందరూ ప్రార్థనల కోసం మసీదుకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. వెంటనే తేరుకుని అక్కడి నుంచి పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకున్నాం. మేమంతా క్షేమంగానే ఉన్నాం. ఈ ప్రమాదం నుంచి జట్టు టీమ్ అంతా తప్పించుకున్నాం. ఇదొక భయానక ఘటన. మా గురించి ప్రార్థించండి’ అని పోస్టు సారాంశం. ఈ సంఘటన వల్ల నెలరోజుల పర్యటనలో భాగంగా బంగ్లా జట్టు న్యూజీలాండ్తో మూడు వన్డేలు ఆడగా ప్రస్తుతం రెండు టెస్టులు ముగియగా శనివారం నుంచి మూడో టెస్టు ప్రారంభం అయ్యే మ్యాచ్ రద్దు అయ్యింది.