అహ్మదాబాద్, ఆగష్ట్ 8: గుజరాత్లో మూడు రాజ్యసభ స్థానాలు భర్తీ కావలసి వుంది. అయితే దీనికి సంబంధించిన పోలింగ్ నేటి ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటలకు పూర్తయింది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా 176మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి బీబీ.సావిన్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ముగ్గురు భాజపా నుంచి, ఒకరు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. కాగా, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీల విజయం తథ్యమే. మరోవైపు కాంగ్రెస్ను వీడి భాజపాలో చేరిన బల్వంత్ సిన్హా రాజ్పుత్, కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్కు మధ్య పోరు రసవత్తరం అయ్యింది. వీరి విజయానికి ఒక్కో అభ్యర్థికి 45ఓట్లు రావాల్సి వుంది. ఈ ఎన్నికలలో తనకే విజయం వరిస్తుందని కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి ఆ రాష్ట్ర ఎన్సీపీ మద్దతు ఇస్తుందని ఆశించారు కానీ, చివరి నిమిషంలో వారి మద్దతు భాజపాకి అని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో కూడా సంఖ్యాబలం తనకే ఎక్కువగా ఉందని కాంగ్రెస్ ప్రకటించడంతో ఫలితాల కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.