న్యూఢిల్లీ, మార్చ్ 13: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రతీ భారతీయుడు తన ఓటు హక్కు విలువను తెలుసుకొని తమ ఓటును వినియోగించుకోవాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు చేస్తూ రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులకు మోడి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ్బంగాల్, తెలంగాణ, ఏపి ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, కెసిఆర్, చంద్రబాబు సహా ప్రతి ఒక్కరినీ ట్విటర్ వేదికగా పేరుపేరునా అభ్యర్థించారు. అంతేకాక శరద్ పవార్, మాయావతి, అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్, స్టాలిన్ తదితరులను కోరుతున్నా. దేశవ్యాప్తంగా ఓటరు అవగాహన కార్యక్రమాలను పెంచాలి. రాష్ట్రాల్లో పోలింగ్ బూత్లకు ఎక్కువ మంది వచ్చేలా కృషి చేయాలని నవీన్ పట్నాయక్, కుమారస్వామి, జగన్, నితీశ్ కుమార్ తదితరులను కోరుతున్నాఅని మోడి వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. రాజకీయ నాయకులనే కాదు సినీ, క్రీడా ప్రముఖులను కూడా మోడి అభ్యర్థించారు. మోహన్లాల్, నాగార్జున , షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, క్రీడా ప్రముఖులు సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, క్రికెటర్లు ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఫోగట్ సోదరీమణులు గీతా, బబిత, విన్నేశ్, బాలీవుడ్ ప్రముఖులు దీపికా పదుకొణె, ఆలియా భట్, అనుష్క శర్మ, అక్షయ్ కుమార్, సల్మాన్ఖాన్, ఆమీర్ఖాన్, అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, కరణ్ జోహార్ తదితరులను మోడి అభ్యర్థించారు. ప్రజాస్వామ్య దేశంలో మీడియా సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మోదీ ఈ సందర్భంగా అన్నారు. ప్రజల ఆలోచనలపై మీడియా పెను ప్రభావం చూపుతోందని, అలాంటి మీడియా సంస్థలు ఓటు హక్కుపై విస్తృత ప్రచారం కల్పించాలని మోడి విజ్ఞప్తి చేశారు.