హైదరాబాద్, మార్చ్ 13: సాధారణంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో బౌలర్ నో బాల్ వేస్తే అంపైర్ ఫ్రీహిట్ ఇచ్చే సంగతి తెలిసిందే. అయితే ఈ నిబంధనను త్వరలో టెస్టు క్రికెట్లోనూ అమలు చేయాలని అంతర్జాతీయ క్రికెట్కు మార్గనిర్దేశాలు రూపొందించే మారిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ప్రతిపాదించింది. తాజాగా బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సమావేశంలో ఎంసీసీ కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. టెస్టు మ్యాచ్ల్లో వేగం పెంచడం కోసం ఓవర్ల మధ్య, బ్యాట్స్మన్ ఔటైనపుడు, విరామ సమయాల్లో టైమర్ ఉపయోగించాలని కూడా ఎంసీసీ సూచించింది. అలాగే టెస్టులపై ఆసక్తి తగ్గడానికి స్లో ఓవర్రేట్ కారణమని చాలామంది అభిమానులు అభిప్రాయపడిన నేపథ్యంలో ఎంసీసీ ఈ సూచన చేయడం విశేషం.