అమరావతి, మార్చ్ 13: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల హీట్ రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో, టీడీపీ- వైసీపీలో మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంటుంది. ఇక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల జాబితా విడుదల కానున్న నేపధ్యంలో, తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.
టీడీపీ నేతలతో ఈరోజు ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కో నియోజకవర్గానికి, జగన్ ఒక్కో రేటు ఫిక్స్ చేశారని, జనరల్ నియోజకవర్గానికి ఒక రేటు, రిజర్వ్డ్ నియోజకవర్గానికి మరో రేటురి నిర్ణయించి, జగన్ టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని చంద్రబాబు ఆరోపణలు చేశారు. వైసీపీలో డబ్బులు ఉన్న వారికే టిక్కెట్లు ఇస్తున్నారని, స్వయంగా ఆ పార్టీని వీడిన నేతలే చెబుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. మరి చంద్రబాబు వ్యాఖ్యల పై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.