బెంగుళూరు, మార్చ్ 13: వధువు మెడలో వరుడు తాళి కట్టడం సాధారణమే...కానీ వరుడు మెడలో వధువు తాళి కట్టడం ఆశ్చర్యమే. కర్ణాటకలోని విజయపుర జిల్లా ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. విజయపుర జిల్లా ముద్దేబిహాళ్ తాలూకా నాలతవాడ గ్రామంలో తాజాగా రెండు పెళ్లిళ్లు జరిగాయి. సోమవారం జరిగిన ఈ పెళ్లిళ్లలో ఇద్దరు పెళ్లి కుమార్తెల చేత ఇద్దరు పెళ్లి కుమారులు తమ మెడలో మూడు ముళ్ళు వేయించుకున్నారు. వధువుల వెనకాల అగ్ని చుట్టూ ఏడు అడుగులు వేశారు. అంకిత అనే వధువు ప్రభురాజ్కు, ప్రియ అనే వధువు అమిత్ మెడలో తాళి కట్టారు. కొన్ని శతాబ్దాల నుంచి వస్తున్న మన సంప్రదాయాలను రివర్స్ చేయడానికి మీకెన్ని గుండెలు అని అడిగినవారికి వారి దగ్గరు వాళ్ళ నోరు మూయించే సమాధానం కూడా వుంది. 12వ శతాబ్దంలో ఈ పద్ధతే అమల్లో ఉండేదని, దాన్నే మేమూ పునరుద్ధరించామని సమాధానం ఇస్తున్నారు. ఇవి అసలుసిసలైన బసవణ్ణ సిద్ధాంతాలకు లోబడి జరిగిన వివాహాలని చాలా గట్టిగా సమాధానం ఇచ్చారు. కాగా ఆధ్యాత్మికవేత్తలు ఇల్కల్ గురుమహంతేశస్వామి, చిత్రదుర్గ బసవమూర్తి, లింగస్గూరు సిద్ధలింగస్వామి తదితరులు ఈ వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.