విజయవాడ, మార్చ్ 12: విజయవాడ సెంట్రల్ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు విజయవాడకు చెందిన కొణిజేటి ఆదినారాయణ తెలిపారు. ఈయన కేసిఆర్కు వీరాభిమాని కావడంతో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించాలని ఇంద్రకీలాద్రి వద్ద 101 కొబ్బరికాయలతో మొక్కు తీర్చుకున్నారు అలాగే టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మోకాళ్లపై ఇంద్రకీలాద్రి ఎక్కారు. అయితే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేయాలని ఆయన అనుకుంటున్నారు. అజిత్ సింగ్ నగర్కు చెందిన ఆదినారాయణ విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారానికి కేటిఆర్ను తీసుకొస్తాననీ, తెలంగాణ ఎంపి అభ్యర్ధులతో పాటే తానూ కేసిఆర్ నుంచి బీఫారం తీసుకుంటానని ఆదినారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నారు.